Saturday, 7 November 2015

అమెరికాలో... ఆసియా ఖండం నుంచి అత్యధిక మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు భారత దేశానికి చెందిన వారే ఉన్నారు. ఆసియా ఖండంలో మనమే టాప్‌లో ఉన్నాం. అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన సైన్స్, ఇంజినీరింగ్ గణాంకాల జాతీయ కేంద్రం నివేదికలో ఇది వెల్లడైంది. ఆసియా నుంచి మొత్తం 29.6 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అమెరికాకు వెళ్తుండగా అందులో భారతీయుల సంఖ్య 9,5 లక్షలు. 2003తో పోలిస్తే భారత్‌ నుంచి వస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 2013లో 85శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఫిలిప్పీన్స్‌ నుంచి ఈ పెరుగుదల 53 శాతం. హాంకాంగ్‌, మకావూతో కలిపి చైనా నుంచి ఈ పెరుగుదల 34 శాతం. 2003 నుంచి 2013 వరకు అమెరికాలో నివసిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 2.16 కోట్ల నుంచి 2.9 కోట్లకు పెరిగింది. అదే కాలంలో వలస వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 34 లక్షల నుంచి 52 లక్షలకు పెరిగింది. 2013 గణాంకాల ప్రకారం అమెరికాలోని వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో 63 శాతం మందికి పూర్తిస్థాయి పౌరసత్వం ఉంది. 22శాతం మంది శాశ్వతంగా ఉంటున్నారు. 15శాతం మంది తాత్కాలిక వీసాదారులు. వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో 57శాతం మంది ఆసియాలో జన్మించినవారు. 20శాతం మంది ఉత్తర అమెరికా (అమెరికా మినహాయించి), మధ్య అమెరికా, కరేబియన్‌, దక్షిణ అమెరికాలో జన్మించిన వారు. 16శాతం మంది ఐరోపాలో, 6 శాతం మంది ఆఫ్రికాలో, ఒకశాతం కన్నా తక్కువ మంది ఓషనియాలో జన్మించినవారు. వలస శాస్త్రవేత్తల్లో 32 శాతం మంది తమ అత్యున్నత డిగ్రీ మాస్టర్స్‌ అని, 9శాతం మంది డాక్టరేట్‌ చేశామని వెల్లడించారు. అమెరికాలో జన్మించిన శాస్త్రవేత్తల్లో ఇది వరుసగా 29 శాతం, నాలుగు శాతంగా ఉంది. 2003-2013 మధ్య కాలంలో జీవశాస్త్ర రంగం, గణితశాస్త్రం, సామాజిక శాస్త్రవేత్త వృత్తుల్లో వలస ఉపాధికి సంబంధించిన వృద్ధి గణనీయంగా ఉంది. 2013లో 80శాతం మందికి పైగా వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ఉద్యోగం లభించింది. అమెరికాలో జన్మించిన వారి విషయంలోనూ ఇంతే శాతం నమోదయింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లోని వలస ఉద్యోగుల్లో 18శాతం మంది కంప్యూటర్‌, గణిత శాస్త్ర రంగాల్లో పని చేస్తున్నారు. 8 శాతం మంది ఇంజినీరింగ్‌ రంగంలో పని చేస్తున్నారు.

No comments:

Post a Comment